వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో భాగంగా తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన ఆయన ‘‘2019 ఎన్నికల ప్రచారంలో నేను భాగస్వామ్యం కాదల్చుకోలేదు. గత 4-5 ఏళ్ల నుంచి చూస్తున్న రూపంలో గానీ, పద్ధతిలోగానీ నేను ప్రచారం చేయబోను..’’ అని స్పష్టం చేశారు.
గత ఆరేళ్లలో పలువురు నాయకులతో పనిచేసిన ఆయన ఇప్పుడుతొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా సొంత రాష్ట్రం బీహార్కు వెళ్లాలను కుంటున్నట్లు చెప్పారు. అంతకు మించి తన భవిష్యత్ ప్రణాళిక గురించి వివరించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెలువడుతున్న వార్తలను సైతం తోసిపుచ్చారు. గతేడాది తన తల్లి మరణించిన సమయంలో ప్రధాని మోదీ తనతో మాట్లాడారనీ, అయితే 2015 మార్చి తర్వాత తాను ఇప్పటివరకు ప్రధాని మోదీని కలుసుకోలేదని చెప్పారు. ప్రభుత్వంలో చేరిన కొంతమంది కారణంగా ప్రధాని మోదీకి, తనకు కొద్దిపాటి అభిప్రాయభేదాలు తలెత్తాయని కూడా వెల్లడించారు. ఈ కారణంగానే ఆయన బీజేపీ శిబిరాన్ని వదిలి బయటికి వచ్చేసినట్టు చెప్పారు.
గతేడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు బీహార్ లో నితీష్ కుమార్ కోసం పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం కొంతకాలం ప్రనిచేసినా ఆ ప్రయాణం ఎక్కువ దూరం సాగలేదు.
కాగ, ప్రస్తుతం రాజకీయాల్లో అతిపెద్ద సవాలు కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మేము ఓ ప్రణాళిక ప్రతిపాదించాం. ఆయన దాన్ని చాలా ఇష్టపడ్డారు. ఎన్నికల సమయంలో మేము ఎలాంటి ఫలితాలు ఆశించామో అంతకంటే మంచి ఫలితాలే వచ్చాయి. ఇక ఆ తర్వాత మేము కలిసి పనిచేయలేదు. పనిచేయలేక పోతే అందులో నేను కల్పించుకోకూడదని నిర్ణయించుకున్నాను...’’ అని తెలిపారు.
బీహార్లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడంలో తన బృందం పనితీరు కంటే ఢిల్లీలో అనుసరించిన ఎన్నికల వ్యూహం మరింత మెరుగ్గా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చేందుకు పంజాబ్లో పనిచేయాల్సిందిగా కాంగ్రెస్ తనను సంప్రదించినట్టు ప్రశాంత్ కిశోర్ గుర్తుచేసుకున్నారు. కాగా రాహుల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించాలన్న వాదనలపై ఆయన స్పందిస్తూ. ‘‘రాహుల్కి అవకాశం ఇవ్వకుండా, కాంగ్రెస్కు ఇతరులు నాయకత్వం వహించాలని మాట్లాడడం మంచిది కాదు’’ అని స్పష్టం చేశారు.