రెండు విడతల పోలింగ్ అనంతరం దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు బిజెపివైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొనే ప్రజలు తమ పార్టీకి ఓటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
2022నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకునే మేనిఫెస్టోలో లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు. అలాగే బెంగాల్లో పౌరసత్వ నమోదు కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల ర్యాలీలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభలకు అనుమతులు నిరాకరిస్తున్నారని గమనించిన ప్రజలు ఆమె ర్యాలీలకు పెద్దగా హాజరుకావడం లేదని ఎద్దేవా చేశారు.
దీదీ కంటే కమ్యూనిస్టు నాయకులే మేలని అమిత్ షా వ్యాఖ్యానించారు. బెంగాల్ రాష్ట్ర అభివృద్ధికి ఈ లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు.
యూపీలో బిజెపికి సీట్లు తగ్గనున్నాయన్న సమాచారంతోనే బెంగాల్పై దృష్టి సారించారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. యూపీలోనూ తమ పార్టీ అత్యధిక స్థానాలు కైవలం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతోనే ఇక్కడ పోరాడుతున్నామని తెలిపారు.
కశ్మీర్కు ప్రత్యేక ప్రధాని, ఆర్టికల్ 370 రద్దుపై మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ పోటీపై స్పందిస్తూ..హిందూ తీవ్రవాదం పేరుతో ఆమెపై అక్రమ కేసులు బనాయించారని మండిపదారు. కోర్టులు ఆమెను నిర్దోషిగా తేల్చాయని గుర్తు చేశారు. అలాగే స్వామి అసీమానందపై కూడా తప్పుడు కేసులు నమోదు చేశారని దయ్యబట్టారు. బెంగాల్ వ్యాప్తంగా సోమవారం నాలుగు ర్యాలీల్లో పాల్గొననున్న అమిత్ షా కోల్కతాలో మీడియాతో మాట్లాడారు.