మహాకూటమి ఒక విఫల కూటమి అని, కాంగ్రెస్ చచ్చిన పాము వంటిదని ఎద్దేవా చేస్తూ కూటమికి అమరావతి అడ్రస్గా మారిందని బిజెపి తెలంగాణ అద్యక్షుడు డా. కె లక్ష్మణ్ ద్వజమెత్తారు. టీయూడబ్ల్యూజే యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.
`సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రెండు, మూడ్రోజుల్లో తమ పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేస్తాం. హెదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో, నియోజకవర్గానికో మేనిఫెస్టో ఉంటుంది. రైతుబంధు పథకానికి మేం వ్యతిరేకం కాదు.. కౌలు రైతులు, పోడు సాగు చేసుకునే గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం’ అని లక్ష్మణ్ వెల్లడించారు.
సీట్ల పంపిణీలో సామాజిక న్యాయాన్ని తాము పాటించామని, బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు సమన్యాయం చేశామని చెప్పారు. తెలంగాణ సమాజం అంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, కేవలం గొర్రెలు, బర్రెలు ఇస్తున్నామంటూ అవమానానికి పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో తెలంగాణను సెంటిమెంట్ ప్రభావితం చేసిందని, 2014-16 మధ్య టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని అంటూ మరో వైపు బీజేపీ అనేక కార్యక్రమాలతో ప్రజలకు తాము చేరువయ్యామని భరోసా వ్యక్తం చేసారు.
టీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వమని చెప్పిన కేసీఆర్ కుటుంబం నుంచి ప్రభుత్వంలో నలుగురు ఎందుకని ప్రశ్నిం చారు. ‘అధికారంలోకి వచ్చాక అమరులను విస్మరించారు. శ్రీకాంతాచారి, యాదిరెడ్డి కుటుంబాల కు న్యాయం జరగలేదు. నిరసన వ్యక్తం చేసిన రైతులకు బేడీలు వేశారు. నేరెళ్లలో దళితులపై థర్డ్డిగ్రీ ప్రయోగించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్ల యింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు’ అని లక్ష్మణ్ అధికార పార్టీపై మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా టీడీపికి కాంగ్రెస్ అమ్ముడుపోయిందని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్లకు మధ్య అవగాహన అనేది మీడియా సృష్టేనని, అది చంద్రబాబు మైండ్గేమ్ అని లక్ష్మణ్ విమర్శించారు. చంద్రబాబు చెప్పేవి ఎవరు నమ్మబోరని లక్ష్మణ్ చెప్పారు. పన్ను ఎగవేతదారులను వెనుకేసుకొస్తూ రాజకీయం చేస్తామనడం సరికాదని స్పష్టం చేసారు. తప్పు చేసి న టీడీపీ వారిని వెనుకేసుకురావడమే బాబు రాజకీయమా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, ఆయన చెప్పే మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తెలంగాణను శాసిం చాలనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బాబుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు తన చెప్పు చేతల్లో ఉండాలనుకునే ఫీట్లు ఇక చెల్లవని స్పష్టం చేసారు.
‘పన్ను ఎగవేతదారులను వెనకేసుకొచ్చే పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే దారుణం. పన్ను కట్టకుండా టీడీపీ వారు తప్పు చేస్తే వారిని వెనుకేసుకొస్తారు. సీబీఐ వంటి సంస్థలను ఎలా వద్దంటారు.. తప్పు చేసిన వారిపై దాడులు చేస్తే మంచిది కాదా.. ఇతర పార్టీల వారిపై దాడులు చేస్తే మంచిదా..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.