సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటే సీఎం చంద్రబాబు ఎందుకు గజగజ వణుకుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే మొదటిసారిగా జీవో జారీ చేసిన సీఎంను ఈయన్నే చూస్తున్నామని ఎద్దేవా చేసారు. మేము అవినీతికి పాల్పడతాం.. మాపై విచారణ జరపకూడదన్న విధంగా సీఎం జీవో జారీ చేసిన తీరును ఆయన తప్పుపట్టారు.
రాష్ట్రప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ జీవో జారీ చేయడం పలు అనుమాలకు తావిస్తోందని తెలిపారు. రాష్ట్రం జారీ చేసిన జీవో హాస్యాస్పదమైందని అంటూ కేంద్రప్రభుత్వ సంస్థలమీద, రాష్ట్రప్రభుత్వం కోరితే రాష్ట్ర వ్యవహారాలపై, న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఎక్కడైనా విచారణ జరిపే హక్కు సీబీఐకు ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆ జీవోను టిష్యూ పేపర్తో సమానమంటున్నారని పేర్కొన్నారు.
మా ఊర్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు మా ఊరికి రావాల్సిన అవసరం లేదంటే ఎలా? అంటూ ఉండవల్లి సీఎం తీరును తప్పుపట్టారు. ఊర్లో అందరూ మంచివాళ్లయితే పోలీసులొచ్చి మీ ఇంట్లో ఉన్నా ఇబ్బందేముంటుందని నిలదీశారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు చేస్తే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. కోటీశ్వరులపై దాడులు జరిగితే వచ్చే నష్టం ఏమిటని అడిగారు.
చంద్రబాబు తన వెనకున్న కోటీశ్వరుల తరఫునా? లేక సామాన్య ప్రజల పక్షమా? చెప్పాలని డిమాండ్ చేసారు. సెక్షన్ 6 ఏమి చెబుతుందో తెలుసుకోకుండా జారీ చేసిన జీవో వల్ల రాష్ట్రప్రభుత్వం పరువుపోయిందని ద్వజమెత్తారు. విచారణ చేస్తామంటే తొడకొట్టి ఆహ్వానించాలిగానీ మావాళ్లను బెదిరిస్తున్నారని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేసారు.
గతంలో రాజకీయ కారణాలతో సీబీఐ విచారణకు ప్రభుత్వాలు ఆదేశించినా.. సీబీఐ విచారణపై ప్రజల్లో నమ్మకం ఉందని ఉండవల్లి చెప్పారు. వైఎస్ జగన్పై కాంగ్రెస్, టీడీపీ కేసులు వేశారని, చంద్రబాబుపైనా విచారణకు ఆదేశించాలని వైఎస్ విజయమ్మ కోరితే కోర్టుల ద్వారా ఆ విచారణ నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. మాకు కోర్టులు అవసరం లేదు, మా ఎమ్మెల్యేలే కోర్టు, లోకేష్ అప్పీల్ కోర్టు, చంద్రబాబు సుప్రీంకోర్టు అని జీవో జారీ చేయిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.